26-06-2025 10:59:35 PM
నాగర్కర్నూల్లో అంతర్జాతీయ డ్రగ్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్..
నాగర్కర్నూల్ (విజయక్రాంతి): అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా గురువారం జిల్లా న్యాయ సేవా సంస్థ, జిల్లా కలెక్టరేట్, పోలీస్ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానం నుండి గవర్నమెంట్ హాస్పిటల్, అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి. రమాకాంత్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(District Collector Badawat Santosh), ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ వైభవ్, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా జెండా ఊపి ప్రారంభించారు.
ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... భారతదేశంలో అత్యధిక యువత ఉన్నప్పటికీ, మాదకద్రవ్యాల వలన వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందన్నారు. గ్రామ స్థాయికి డ్రగ్స్ వ్యాప్తి నీవారించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ విషయంలో శ్రద్ధ వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ... డ్రగ్స్ వల్ల యువత మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్ నిరోధక కమిటీలను బలోపేతం చేయాలి. ఇప్పటికే జిల్లాలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశాం.
ప్రతి పౌరుడు డ్రగ్స్ వ్యసనం నిర్మూలనలో భాగస్వామిగా మారాలని చెప్పారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ మాట్లాడుతూ.... గత వారం రోజులుగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయని పోలీసులకు సమాచారం అందిస్తే, వెంటనే స్పందిస్తాం. యువతకు సరైన మార్గనిర్దేశనం అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రాజేశ్వరి, డిఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డిఎస్పీ శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ లత, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యాసంస్థల విద్యార్థులు, యువత, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం డ్రగ్స్పై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.