హైడ్రాను ప్రజలంతా కోరుకుంటున్నారు: రంగనాథ్
సికింద్రాబాద్, మే7 (విజయక్రాంతి): ప్రజలంతా హైడ్రాను కోరుకుంటున్నారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నగర ప్రజలే కాదు ఇతర పట్టణాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. నల్గొండలో ఓ ప్రైవేటు కార్యక్రమనికి హాజరయిన సందర్భంగా అక్కడ విలేకరులు కమిషనర్ను కలసి హైడ్రా కార్యక్రమాలపై ఆరా తీశారు. చాలా మంది హైడ్రాను విస్తరించాలని కోరుతున్నారని కమిషనర్ పేర్కొ న్నారు.
అయితే ప్రస్తుతం మా పరిధి ఓఆర్ఆర్ వరకే ఉంటుందన్నారు. ఆక్రమణలు తొలగించి చెరువులను అభివృద్ధి చేయడం ఎలానో ఇక్కడకు వచ్చి కర్ణాటక మున్సిపల్ బృందాలు తెలుసుకుంటున్నాయని, ఇటీవల చెన్నై నుంచి కూడా అధికారుల బృందం వచ్చి చెరువుల అభివృద్ధిని, వర్షాకాలం వరదలు ముంచెత్తకుండా హైడ్రా తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిందన్నారు.






