ఈవీఎం గోదాం తనిఖీ
ములుగు మహబూబాబాద్ జూన్ 8 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఈవీఎం గోదాంను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సోమవారం తనిఖీ చేశారు. కలె క్టర్, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాం సీల్ ను పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భంలో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు. గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం.డి. సలీం, డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.






