14 April, 2026 | 4:17 AM

అరైవ్.. అలైవ్.. పట్ల అవగాహన

14-04-2026 01:49 AM

కామారెడ్డి జిల్లాలో విస్తృత కార్యక్రమాలు

కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్  తెలిపారు. కామరెడ్డి లో సోమవారం పోలీస్, రవాణా, ఆర్ & బి, విద్య, వైద్య శాఖల సమన్వయంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 13 నుండి 18 వరకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగవాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కలెక్టర్ చాంబర్  నిర్వహించారు. 

ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా చేపట్టే అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ పాదచారులు, వాహనదారులకు రహదారి భద్రతపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంబంధిత శాఖల అధికారులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఏ ఎం వి ఐ లు చంద్రశేఖర్, జిల్లా విద్య శాఖ అధికారి రాజు, జిల్లా వైద్య అధికారి రవీందర్ గౌడ్, ఆర్ అండ్ బి ఈ ఈ మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.