16-09-2025 12:27:32 AM
కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ములకలపల్లి, సెప్టెంబర్ 15, (విజయక్రాంతి): అంతర పంటల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం ములకలపల్లి మండలం మూక మామిడి పంచాయతీ పరిధిలోని గుట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద చేపట్టిన వెదురు సాగును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులు కనితి భద్రయ్య, కనితి రాధా, కనితి పొట్టమ్మల పొలాల్లో స్వయంగా వెదురు మొక్కలు నాటి, గ్రామీణ వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు.
అనంతరం మొగరాల గొప్ప గ్రామంలో రైతు కీసర సుజాత వెదురు సాగును మొక్కను నాటి ప్రారంభించారు .అనంతరం కుండ్రు వెంకటమ్మ ఎకరం పొలంలో సాగు చేస్తున్న మునగ తోటను, గడ్డం వారి గుంపు గ్రామంలో రైతు కొమ్ము బుచ్చన్న సాగు చేస్తున్న రెండెకరాల మునగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్ , ప్రతి రైతు సంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలి. అంతర్ పంటల సాగు ద్వారా తక్కువ భూమిలోనూ అధిక ఆదాయం పొందవచ్చు. ఆయిల్ పామ్ తోటల్లో మునగ, బెండలను వేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. వెదురు సాగులో పెసలు, బొబ్బర్లు, మినుములు, రాగి వంటి పంటలు వేసుకుంటే కుటుంబ ఆదాయం మరింతగా పెరుగుతుంది అని అన్నారు.
రైతు వేసే ప్రతి పంట కేవలం మీ కుటుంబానికే కాదు, గ్రామ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుంది. కొత్త పంటలపై నమ్మకం పెట్టుకుని సాగు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. వెదురు సాగుకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు పండించే వెదురును బెండలంపాడు బ్యాంబు క్లస్టర్ ద్వారా తయారీ ఉత్పత్తులకు వినియోగించి సులభంగా మార్కెటింగ్ చేయవచ్చు. దీని ద్వారా మీరు స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కూడా సృష్టించవచ్చు అని అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, తాసిల్దార్ గన్యా నాయక్, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, ఏటీఎం వెంకయ్య, ఏపీవో హుస్సేన్, ఎల్ డి ఎం సమ్మక్క మరియు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.