ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు అష్ట కష్టాలు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, మే 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తి రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొందని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ వద్ద తొర్రూరు మహబూబాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా, వారికి మాజీమంత్రి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుకు ఏనాడు కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కష్టం రాకుండా చూసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచారం తప్ప ఆచరణలో ఎక్కడ కూడా రైతుకు అండగా నిలిచినట్లు కనిపించడం లేదని విమర్శించారు. పంటలు పండించడం ఒక ఎత్తుతై, వాటిని విక్రయించడం మరో సమస్యగా మారిందని, ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి రైతులను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు.






