22-06-2025 02:24:37 PM
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోవడం జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) ఆదివారం స్పష్టం చేశారు. మంత్రివర్గంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు. పార్టీల ముఖ్యనేతలు, పారిశ్రామిక వేత్తల ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మహేష్ గౌడ్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అయినవారి పేర్లు వెల్లడించాలని సిట్ అధికారులను కోరుతున్నానని ఆయన తెలిపారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో భాగమైన ప్రతీ ఒక్కరూ జైలుకు వెళ్తారని సూచించారు.
స్థానిక సంస్థలకు 2025 జూలైలో ఎన్నికలు జరుగుతాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ప్రకటించడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల విషయం కోర్టులో ఉన్నందున మంత్రులు వాటిపై వ్యాఖ్యానించడం మానుకోవాలని హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు ఇంకా ఖరారు కానప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికలపై ఏదైనా వ్యాఖ్యానించడం సరికాదని కూడా ఆయన మందలించారు. తెలంగాణ క్యాబినెట్ మంత్రులు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖలకు కట్టుబడి ఉండాలని, వారి డొమైన్ల నుండి వైదొలగవద్దని ఆయన కోరారు.