బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన
అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్
కోనరావుపేట, జూలై 27 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని ఇసుక క్వారీ వద్ద సోమవారం రైతులు నిరసన చేపట్టి ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. క్వారీకి కేవలం మూడున్నర ఎకరాల పరిధిలో మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని రైతులు ఆరోపించారు.
వర్షాకాలంలో అధికంగా ఇసుక తవ్వకాల వల్ల వాగు సహజ ప్రవాహం దెబ్బతిని పరివాహక ప్రాంతంలోని వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.భూముల కోత, సాగునీటి సమస్యలు తలెత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.అధికారులు వెంటనే క్వారీ వద్ద తనిఖీలు నిర్వహించి అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని, అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.పరిస్థితిని పర్యవేక్షించి రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని వారు కోరారు.






