రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన
చివ్వెంల, జూలై 14: బీఆర్ఎస్ నేతల రక్తంతో వ్యవసాయం చేయిస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం సేవాలాల్ తండా ఆవాసం పందిబండ తండాకు చెందిన రైతులు మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు తమ చేతుల నుంచి రక్తాన్ని తీసి పంట పొలాల్లో చల్లుతూ నిరసన వ్యక్తం చేశారు.
వ్యవసాయం రైతుల చెమట, శ్రమ, త్యాగాలతో సాగుతుందని, రైతుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అవమానించేలా మాట్లాడటం తగదని, వ్యవసాయంపై రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చర్చనీయాంశంగా మారాయి. పందిబండ తండా రైతులు చేపట్టిన ఈ వినూత్న నిరసన పలువురి దృష్టిని ఆకర్షించింది.






