మల్లన్నసాగర్ నీళ్లు పెంచాలి.. చెరువు తూము విడుదల చేయాలి
మూడు గ్రామాల రైతుల రాస్తారోకో
సిద్దిపేట రూరల్: మల్లన్నసాగర్ నుంచి వచ్చే 6ఆర్ కాలువ ద్వారా దమ్మచెరువు మీదుగా చింతమడక పెద్ద చెరువులోకి నీటి ప్రవాహాన్ని పెంచాలని, అలాగే చింతమడక(Chintamadaka) పెద్ద చెరువు తూము విడుదల చేసి అంకంపేట చెరువు క్రింద ఉన్న రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు.
లక్ష్మీదేవిపల్లి స్టేజి వద్ద సిద్దిపేట–ముస్తాబాద్ రహదారిపై(Siddipet-Mustabad Road) రైతులు ఆందోళన చేపట్టారు. సీతారాంపల్లి, అంకంపేట, లక్ష్మీదేవిపల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటి ప్రవాహం పెంచి చెరువులకు నీరు విడుదల చేయాలని రైతులు కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.




