9 April, 2026 | 2:02 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

05-11-2025 01:11 AM

-బకాయిల కోసం బీసీ విద్యార్థి సంఘాల పోరుబాట

-ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముట్టడికి యత్నం

-అడ్డుకున్న పోలీసులు.. బైఠాయించిన విద్యార్థులు

ఖైరతాబాద్, నవంబర్4 (విజయక్రాంతి):ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ ఇప్పటికే విద్యా సంస్థల బంద్ కొనసాగుతుండగా..మరోవైపు విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. మంగళవారం బీసీ విద్యార్థి సంఘాలు మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు విద్యామండలి కార్యాలయం ఎదురుగా బైఠాయించి నిరసనకు దిగారు.

విద్యార్థుల ఆందోళనకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వరి బోనస్, రైతు బంధు, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల బకాయిలతో ఇబ్బంది పెడుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా.. 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ కోసం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 1200 కోట్లు విడుదల చేయాలని, అయితే ఇందులో కేవలం రూ. 300 కోట్లు చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.

ఇలా అయితే ప్రైవేట్ కాలేజీలు ఎలా నడుస్తాయి..? ఉద్యోగులకు జీతాలు ఎట్లా చెల్లించాలి..? బకాయిలు చెల్లించడం లేదని విద్యార్థు లకు ఆయా కాలేజీలు సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. మరి విద్యార్థులు ఉన్నత చదువులు ఎలా చదవాలి..? ఉద్యోగాలు పొందేది ఎలా..? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మంత్రులతో ఓ సబ్ కమిటీ వేసిందని..దసరాకు, దీపావళికి విడతల వారీగా చెల్లిస్తామని చెప్పి మాట తప్పిందన్నారు.

దీంతో కాలేజీలు నడపలేక యాజమాన్యాలు ఇబ్బందుల్లో పడ్డాయని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే తనిఖీల పేరుతోవారిని బెదిరిస్తందని విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయం బర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు ఉదృతమవుతాయని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, సురేష్ తదితరులు ఉన్నారు.