30 June, 2026 | 4:05 PM

మూడు దశాబ్దాల సుదీర్ఘ సేవలకు ఘన వీడ్కోలు

30-06-2026 03:26 PM

పోలీసు శాఖకు మీ సేవలు చిరస్మరణీయం అడిషనల్ డీసీపీ కె.శ్రీనివాస్

రామగుండం కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన అధికారులకు ఆత్మీయ సన్మానం

రామగుండం,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఏడుగురు పోలీసు అధికారులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, పోలీసు వృత్తిలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు విశిష్ట సేవలందించిన వారిని కొనియాడారు.

పోలీసు శాఖకు వారి సేవలే గర్వకారణం

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ఠాకూర్ సహదేవ్ సింగ్, మహమ్మద్ అహ్మదుల్లా, మేకల మహేందర్ రెడ్డి; ఏఎస్‌ఐలు బోయ శ్రీనివాస్, మహమ్మద్ అమానుల్లా; ఏఆర్ ఎస్‌ఐ పి. వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ బొట్ల చేరాలులను అడిషనల్ డీసీపీ కె.శ్రీనివాస్ పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం అనేది కేవలం ఉపాధి కాదు, అది ఒక బాధ్యత. మూడు దశాబ్దాలకు పైగా కుటుంబ సమయాన్ని, వ్యక్తిగత సుఖాలను త్యాగం చేస్తూ, పగలు రాత్రి అనక ప్రజల భద్రత కోసం మీరు అందించిన సేవలు పోలీసు శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనేది ఒక అధ్యాయానికి ముగింపు మాత్రమేనని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, సమాజానికి మీ అనుభవాలను మార్గదర్శకాలుగా అందించాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ రమేష్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ గోపి, ఆర్‌ఐలు దామోదర్, శేఖర్, పెద్దన్న, రమేష్, సీపీఓ సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సందీప్, సంధ్య, సీసీ హరీష్, ఆర్‌ఎస్‌ఐలు వెంకట్, సరిత, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పోచలింగం తదితరులు పాల్గొన్నారు.