calender_icon.png 18 June, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణన చేపట్టకపోతే కేంద్రంపై పోరాటం

17-06-2025 11:56:14 PM

పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు..

హైదరాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జన గణనలో భాగంగా కుల గణన చేయకపోతే ప్రజాపోరాటం తప్పదని పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు(Former PCC chief V. Hanumantha Rao) హెచ్చరించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ జన గణనను మాత్రమే ప్రస్తావిస్తున్నదని, కుల గణన ఊసు తీసుకురావడం లేదని దుయ్యబట్టారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అగ్రకులంలో పుట్టినప్పటికీ అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు.

అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని వెల్లడించారు. సభా వేదికల్లో తాను బీసీ అని చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. వారి సంక్షేమం కోసం ఎందుకు ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం జన గణన చేపడితే బీజేపీకి మాత్రమే లాభమని, బీసీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. కేంద్రం కుల గణన చేపట్టేవరకు రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.