11-08-2025 01:17:54 AM
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వేతనాల పెంపు వివాదంపై తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, నిర్మాతల మధ్య చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. శనివారం నిర్వహించిన చర్చలు ఫలించలేదు. వేతనాల చెల్లింపు విధానాన్ని ఛాంబర్ నాయకులు ఫెడరేషన్ కు వివరించారు. వచ్చే మూడేళ్ల కాలంలో విడతల వారీగా నిర్ణీత కార్మికులకే వేతనాలు పెంచుతామని స్పష్టం చేశారు. ఈ విధానం నచ్చకపోవటంతో ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీకార్మికులు 18వ రోజు ఆందోళనను తీవ్రతరం చేశారు.
ఆదివారం ఉదయం నుంచే సినీ కార్మిక 24 విభాగాల యూనియన్లలోని సభ్యులంతా ఫిల్మ్ ఛాంబర్ వద్దకు చేరుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆందోళనకు దిగారు. 30 శాతం వేతనాలు పెంచాల్సిందేనంటూ ఈ సందర్భంగా వారు చేసిన నినాదాలతో ఛాంబర్ ప్రాంగణం దద్దరిల్లింది. చర్చలు ఫలించకపోతే, అన్ని రకాల షూటింగ్లను పూర్తిగా నిలిపివేస్తామని ఫెడరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలకు రెండు మూడు రోజులు షూటింగ్లకు సమయం మిస్తామని. ఆ తర్వాత షెడ్యూల్ ఉన్నవారితో కూడా మాట్లాడి షూటింగ్లు నిలిపివేస్తామంటూ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా వేతనాలను సవరించలేదని, ఈ కారణంగా తమ కార్మికులు జీవన వ్యయానికి ఇబ్బందులు పడుతున్నారని ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
నిరాహార దీక్ష చేస్తాం: ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్
తాజాగా ఫెడరేషన్ కార్యాలయం దగ్గర ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. ‘మా సమస్యలు పరిష్కారం కాకపోతే చాంబర్ను ముట్టడిస్తాం.. నిరాహార దీక్ష చేస్తాం. నిర్మాతలకు నచ్చిన టైంలో ఉన్న కాల్షీట్స్కు కార్మికులు పని చేయాలని అంటున్నారు. మాకు నచ్చిన వారిని తీసుకుంటామని చెబుతున్నారు. అలాగే ఒకరిద్దరు నిర్మాతలు స్కిల్స్ లేవని కార్మికులను అవమానిస్తున్నారు. సినీ కార్మికుల పొట్ట కాలితే వాళ్లే తిరిగి వస్తారని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు.
వేతనాలు పెంచమంటే నిర్మాతలకు స్కిల్స్ గుర్తొచ్చిందా? మేము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు.. ఏటా 10 శాతం చొప్పునే పెంచమంటున్నాం. నిర్మాతలు మూడేళ్లకు 15 శాతం, ఐదు శాతం చొప్పున పెంచుతామన్నారు. అదికూడా అన్ని యూనియన్లకు పెంచమని అంటున్నారు. కేవలం 1500 లోపు వాళ్లకు మాత్రమే వేతనాలు పెంచుతామని, ఆపైన ఉన్నవారికి వేతనాలు పెంచమని అంటున్నారు. వేతనాలు అందరికీ సమానంగా పెంచాలని కోరాం.
షూటింగ్స్ నిలిపివేతపై మేం మూడు నెలల ముందే సమాచారం ఇచ్చాం. మూడేళ్లకు ఓసారి మాత్రమే వేతనాలు పెంచాలని అడుగుతున్నాం. కానీ, కొందరు.. కార్మికులను విడగొట్టాలని చూస్తున్నారు. కార్మికులతో పని చేయించుకోవాలి.. వారికి వేతనాలు ఇవ్వాలి. కానీ, కార్మిక సంఘాలను విడగొట్టాలని చూస్తే ఊరుకోం. కార్మిక పక్షం నిలిచిన మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. షెడ్యూల్లో ఉన్న షూటింగ్స్కు రెండు రోజులు గడువు ఇస్తున్నాం. ఆ తరువాత అన్ని షూటింగ్స్ ఆపేస్తాం. మెగాస్టార్ చిరంజీవి టచ్ లోనే ఉన్నారు.. కానీ, మేము ఫిలించాంబర్తో మాత్రమే మాట్లాడతాం. మా డిమాండ్లు పరిష్కరించకుంటే చాంబర్ వద్దే తేల్చుకుంటాం.
ఎల్లుండి లేబర్ కమిషన్ ఆఫీసుకు మేము.. నిర్మాతలు వెళ్తాం. మా సమస్య పరిష్కారం కాకపోతే చాంబర్ ను ముట్టడించి నిరాహార దీక్ష చేస్తాం. షూటింగ్స్ అన్నీ కూడా ఆపేస్తాం. చాంబర్ లో అంతర్గత గొడవలకు.. కార్మికుల వేతనాలను అడ్డం పెట్టుకుంటున్నారని భావిస్తున్నాం. నిర్మాత విశ్వప్రసాద్ నోటీసు ఎందుకు పంపారో తెలియదు. నేరుగా పంపే అధికారం లేనందున ఫిల్మ్ చాంబర్ కు నోటీసులు పంపిస్తాం. నిర్మాత విశ్వప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వచ్చేవరకు ఆయన సినిమా షూటింగ్ లకు హాజరుకాబోము. చాంబర్ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుంది‘ అని మీడియా సమావేశంలో వల్లభనేని అనిల్ స్పష్టం చేశారు.