09-09-2025 12:00:00 AM
కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, సెప్టెంబర్ 08 (విజయక్రాంతి): జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించనున్నట్టు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందని అన్నారు.
ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10వ తుది జాబితా వెలువరిస్తామని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిప్యూటీ సీ.ఈ.ఓ సాయన్న, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.