17-06-2025 12:59:31 AM
-లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా వెసులుబాటు
- ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాకుంటే లబ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని, అర్హత కలిగిన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కాంట్రాక్టర్ మోడ్ నుంచి లబ్ధిదారుల నేతృత్వంలోనే నిర్మాణం (బీఎల్సీ మోడ్లో) చేపట్టి పూర్తిచేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.
సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌళిక వసతులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన గత పాలకులు విస్మరించారని మండిపడ్డారు.
పదేళ్లలో 60 వేల ఇండ్లను మాత్రమే అరకొరగా పూర్తి చేశారని తాగునీరు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సదుపాయాలను విస్మరించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మౌళిక వసతులు కల్పించడంతోపాటు అసంపూర్తిగా ఉన్న 1.61 లక్షల ఇండ్లను రూ.640 కోట్లతో పూర్తిచేసి 98 వేల మంది లబ్ధిదారులకు కేటాయించినట్టు తెలిపారు.
ఇంకా 69 వేల ఇండ్లు అసంపూర్తిగా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, వీటిని బీఎల్సీ మోడ్లో పూర్తిచేస్తామని తెలిపారు. ఇందుకోసం అరులైన లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటి వరకు 2.65 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 71వేల ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, దాదాపు మూడు వేల ఇళ్లు గోడలు, శ్లాబ్ల వరకు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు.