10 July, 2026 | 10:47 AM

పారిస్‌కు ఒలింపిక్స్ జ్యోతి

09-05-2024 12:05 AM

మార్సెయిల్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు స్పూర్తిగా నిలిచే టార్చ్ రిలే ఆతిథ్య ఫ్రాన్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం మార్సెయిల్ దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి ఒలింపిక్స్ జ్యోతి చేరుకుంది. ఏప్రిల్ 16న గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియాడ్‌లో మొదలైన రిలే సముద్ర మార్గం గుండా ఏథెన్స్‌ను దాటి మార్సెయిల్‌కు చేరుకుంది. బెలిమ్ అనే ఓడ ద్వారా టార్చ్ రిలేను ఫ్రాన్స్‌కు తీసుకొచ్చారు. కాగా మార్సెయిల్ వీధుల్లో ఒలింపిక్ టార్చ్‌ను అథ్లెట్లు ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మార్సెయిల్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రదర్శనను తిలకించేందుకు వీవీఐపీలు, వీఐపీలు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 8వేల మంది పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య జ్యోతి ప్రదర్శన వేడుక దిగ్విజయంగా జరిగింది. కాగా ఫ్రాన్స్‌లో వివిధ ప్రాంతాల్లో తిరిగిన తర్వాత టార్చ్ రిలే జూలై 14న ఆతిథ్య పారిస్‌కు చేరుకోనుంది. మళ్లీ అక్కడి నుంచి బయల్దేరి నాన్‌తెర్.. సీన్ సెయింట్ డెన్నిస్ తదితర ప్రాంతాలను చుట్టి సీన్ నది గుండా జూలై 26 కల్లా  మళ్లీ పారిస్‌కు రానుంది. ఒలింపిక్స్ వేడుకల ఆరంభోత్సవం రోజు సాయంత్రం 80కి పైగా బోట్లలో అథ్లెట్లు సీన్ నదిలో జ్యోతితో సుమారు 6 కిలోమీటర్లు పరేడ్ నిర్వహిస్తారు. సీన్ నది దగ్గర మొదలై ఈఫిల్ టవర్‌తో ముగిసే ప్రారంభోత్సవ కార్యక్రమం నాలుగు గంటల పాటు సాగనుంది. ఇక విశ్వక్రీడలు జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.