22-07-2025 02:41:44 PM
నాగార్జునసాగర్,విజయక్రాంతి: జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి లక్షకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుకుంటోంది. జూరాల 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir) పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలుకాగా, ప్రస్తుత నీటినిల్వ 208 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 67,346 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు.
మరోవైపు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద ప్రవాహాం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ నీటిమట్టంగత 22 రోజుల్లోనే 55 అడుగుల మేర పెరగడం విశేషం. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ప్రస్తుతం 570 అడుగులకు చేరుకుంది. మరో 20అడుగులు పెరిగితే.. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. అటు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతం 256టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మరో 50 టీఎంసీలు ల నీరు సాగర్ ప్రాజెక్టులోకి చేరితే.. గేట్లు ఎత్తి దిగువన పులిచింతలకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు.ఆగస్టు రెండో తేది వరకు సాగర్ ఎడమ కాలువకు అన్నదాతలకు సాగు నీటి విడుదల చేయనునున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సాగర్ నుండి 4,618 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో గా విడుదల చేస్తున్నారు ప్రాజెక్ట్ అధికారులు.