డిక్లరేషన్ ఘనం, ఆచరణ శూన్యం
లంబాడీల ఓట్లు కావాలిగానీ.. వాళ్ల సంక్షేమం పట్టించుకోరా?
లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వలేదు
హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్(Fee reimbursement) నిధులు కూడా ఇవ్వటం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్ కు రూ. 100 కోట్లు ప్రకటించి రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. 'ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేశారు.. డిక్లరేషన్ ఘనం, ఆచరణ శూన్యం' అన్నారు. లంబాడీల ఓట్లు కావాలిగానీ.. వాళ్ల సంక్షేమం పట్టించుకోరా? అని ప్రశ్నించారు. లగచర్లలో గిరిజనులను హింసించి భూములు లాక్కున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి కేరళకు(Revanth Reddy Kerala campaign) పోయి తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. 'ఏం హామీలు అమలు చేశావ్ నాయన' నిన్న జరిగిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకుల మీద ప్రజలు తిరగబడ్డారని సూచించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇచ్చింది 16 వేల ఉద్యోగాలేనని మొన్న అసెంబ్లీలో తేలిపోయిందని చురకలంటించారు. ఇంట్లో ఈగల మోత ఉంటే అది విడిచిపెట్టి రేవంత్ రెడ్డి కేరళకు పోయి పల్లకీలు మోస్తున్నాడని తెలిపారు. ''నీ ఇల్లే సక్కగ లేదు.. ఇక్కడ హామీలే అమలు చేయలేదంటే, కేరళలో హామీలు అమలు చేస్తామని అంటున్నాడు'' అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.




