calender_icon.png 25 November, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ హయాంలోనే 100 పడకల హాస్పిటల్ 80% పూర్తి

25-11-2025 05:41:00 PM

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..

​నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు 80 శాతం పూర్తయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ​మంగళవారం నకిరేకల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం నాటి ముఖ్యమంత్రి కె.సి.ఆర్.  జనవరి 22, 2022న రూ. 32 కోట్లతో ఈ వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్. చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన చేయించామని, ఇది నకిరేకల్ అభివృద్ధిలో ఒక మైలురాయి అని  ఆయన పేర్కొన్నారు.

​తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆసుపత్రి నిర్మాణంపై కొంతమంది ఎగతాళి చేసినా లెక్క చేయకుండా పనులు ప్రారంభించామని  ఆయన తెలిపారు. ఫౌండేషన్ నుండి స్లాబ్ వరకు ప్రతి పనిని దగ్గరుండి పర్యవేక్షించామని, కరోనా సమయంలో కూడా పనులను ఆపలేదని ఆయన తెలిపారు.​నాటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ. 32 కోట్లతో పాటు, ఆసుపత్రి నిర్వహణ, 69 మంది సిబ్బంది జీతాల కోసం ప్రతి సంవత్సరం రూ. 6.35 కోట్లు ప్రభుత్వమే భరించేలా జి.ఓ. ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో ప్రజలకు అవసరమైన ఆసుపత్రిని నిర్లక్ష్యం చేయడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు.​

గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనుల పూర్తికి ఏమాత్రం చొరవ చూపలేదని, నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచి పద్ధతి కాదు అని ఆయన సూచించారు.​ వెంటనే మేలుకుని, ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేసి, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని  ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రగాడపు నవీన్ రావు, పల్లె విజయ్, నోముల కేశవరాజు, గుర్రం గణేష్, రాచకొండ వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.