04-12-2025 01:22:11 PM
తుర్కయంజాల్, ఆదిభట్ల మున్సిపాలిటీలు చార్మినార్ జోన్ లో కలపడం దుర్మార్గం
తుగ్లక్ నిర్ణయాలను తిప్పికొట్టేలా ప్రజా ఉద్యమం
ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి(Former MLA Manchireddy Kishan Reddy) తీవ్రంగా మండిపడ్డారు. శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో విలీనం చేయరాదని ఒకవైపు జిల్లా ప్రజలు ఉద్యమిస్తుంటే దానికి విరుద్ధంగా ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు వెలువరించడాన్ని ఆయన తప్పుబట్టారు.
అదికూడా తుర్కయంజాల్, ఆదిభట్ల మున్సిపాలిటీలను ఏకంగా చార్మినార్ జోన్ పరిధిలోకి చేర్చడం తలతిక్క చర్య అని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఆస్తుల మీద , ఆదాయం మీద కన్నేసిన ప్రభుత్వ పెద్దలు జిల్లా ప్రజల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని ఆరోపించారు. తుక్కుగూడ మున్సిపాలిటీని ఎల్బీనగర్ జోన్ లో చేర్చి , దానికి సమీపంలో ఉన్న తుర్కయంజాల్ , ఆదిభట్ల మున్సిపాలిటీలను చార్మినార్ లో కలపడం తుగ్లక్ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. జిల్లా అస్థిత్వాన్ని దెబ్బతీయడానికి , జిల్లా ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే అస్తవ్యస్త నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.