24 April, 2026 | 5:21 PM

శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్యే

24-04-2026 04:20 PM

బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే మెచ్చా

దమ్మపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ప్రాణాలను బలితీసుకున్నాయని  అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ ఆత్మబలిదానంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని విమర్శించారు.

అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసి, కార్మికుల కష్టాలను తీరుస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ, రెండున్నరేళ్లుగా వారిని నిలువునా వంచిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న నమ్మకద్రోహాన్ని, నిరంతర వేధింపులను తట్టుకోలేకే శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆయన పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి తోటి కార్మికులు నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి, పోలీసులతో అణచివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. తక్షణమే బాధితుడి కుటుంబానికి ఒక కోటి రూపాయల పరిహారం ప్రకటించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని.డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును 'అప్పాయింటెడ్ డే'గా ప్రకటించి ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆయన స్పష్టం చేశారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలనీ ప్రార్ధించారు.