18 July, 2026 | 10:09 AM

చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన

18-07-2026 10:09 AM

వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ చేతుల మీదుగా ప్రారంభం

 రూ.90 లక్షల కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం వేగవంతం

గంభీరావుపేట, జులై 18 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని చారిత్రక జామా మసీదు( historic Jama Masjid) విస్తరణ, మరమ్మతులు, ఆధునీకరణ పనులకు శనివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. సుమారు రూ.45 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ పనులను తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమం ఖురాన్ పారాయణం, ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మసీదు కమిటీ సభ్యులు, ఉలేమాలు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరయ్యారు. మసీదు కమిటీ సభ్యులు మాట్లాడుతూ, రోజురోజుకు నమాజ్ చేసే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మసీదును విస్తరించి ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ మాట్లాడుతూ, గంభీరావుపేట తన స్వగ్రామమని, ఇక్కడి జామా మసీదు ప్రాంత ప్రజలకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. మసీదు ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా సుమారు రూ.90 లక్షల వ్యయంతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నిర్మాణం పూర్తయ్యాక రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ అభివృద్ధి ప్రాజెక్టుకు ఆమోదం లభించడంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ చొరవ కీలకమని మసీదు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ మహబూబ్ అలీ, సయ్యద్ ఘాజీుద్దీన్ జుబైర్, మహ్మద్ యహ్యా అస్లం, సయ్యద్ సాదతుల్లా హుస్సైనీ, సయ్యద్ అసదుల్లా హుస్సైనీ, హాఫిజ్ అబుల్ కలాం, మహ్మద్ వసీమ్, సయ్యద్ హాష్మీ, సఫీఉద్దీన్ నయీర్, యాసిన్ హుస్సైన్, మహ్మద్ రహీముద్దీన్, మహ్మద్ తాహిర్, సయ్యద్ షరీఫ్, సయ్యద్ విలాయతుల్లా, మహ్మద్ ఆరిఫుద్దీన్, మహ్మద్ నజ్ముద్దీన్, నాసిర్ హుస్సైన్, మహ్మద్ షాహిద్ అలీ, ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మహ్మద్ తురాబ్ అలీ, పురావస్తు సంరక్షణ నిపుణుడు మీర్ బరఖతుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.