ఎస్బీఐలో మోసం.. నలుగురు అరెస్ట్
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ, ఏప్రిల్ 21(విజయక్రాంతి): నల్గొండ దేవరకొండ పట్టణ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ కమర్షియల్ బ్రాంచ్లో జరిగిన ఆర్థిక మోసం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.65 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మోసానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్ కాంట్రాక్టు హౌస్ కీపింగ్ ఉద్యోగి లెండల చక్రపాణి ఇనాక్టివ్ ఖాతాలను దుర్వినియోగం చేసి రూ. 2,65,55,268లను బదిలి చేసినట్లు మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవపూడి ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని విచారించగా నేర విధానం మొత్తం బయటికొ చ్చిందన్నారు.
ఇనాక్టివ్ ఖాతాలను అప్ డేట్ చేసి వారి ఖాతాల నుంచి డబ్బును ఇతరుల ఖాతాలకు మళ్లించేవాడని గుర్తించినట్లు చెప్పారు. నిందితునికి సహాయం చేసిన వారిలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులు, కేతావత్ రాంలాల్, మారేపల్లి శివలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును చేధించిన దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ పీ వెంకట్ రెడ్డి, ఎస్ఐ రాజు, కానిస్టేబుళ్లు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా, వీ సింహాద్రి, హోం గార్డ్ సోమ్లాలను ఎస్పీ శరత్ చంద్ర పవాన్ అభినందించారు.






