ఓల్ఎంఐజీ కాలనీలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం
ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
రామచంద్రపురం, జూలై 19: రామచంద్రపురం మండలం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్ ఎం ఐ.జి కాలనీలోని బీ పార్క్ ప్రాంగణంలో బి.హెచ్.ఇ.ఎల్ - ఎం.ఐ.జి హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో యశోదా హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరానికి భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో యశోదా హాస్పిటల్కు చెందిన ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డా. కీర్తి, డా. నిఖిల్ పాల్గొని కాలనీ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు.
ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి నివాస ప్రాంతంలోనే ఉచితంగా అందించడం ఎంతో అభినందనీయమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఇలాంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఓల్ ఎం.ఐ.జి కాలనీ అధ్యక్షులు రాజు, డైరెక్టర్ రాధాకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు రాణి యాదవ్, సంపత్ గౌడ్, రాకేష్, అరుణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.






