తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
కడ్తల్ మండలంలో విషాదం
కడ్తల్ (చరికొండ), ఫిబ్రవరి 25: వృత్తిరీత్యా కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కిన ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడిన ఘటన కడ్తల్ మండల పరిధిలోని చరికొండ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. చరికొండ గ్రామానికి చెందిన ముత్యాలు గౌడ్ అనే గీతా కార్మికుడు ప్రతిరోజులాగే తన జీవనోపాధి కోసం తాటి వనానికి వెళ్లారు. చెట్టుపై కల్లు గీస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాలు జారడంతో నేరుగా కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరగడంతో పాటు శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించిన తోటి గీతా కార్మికులు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితుడిని వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.
అయితే, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అత్యవసరంగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మహేందర్ గౌడ్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ‘ఎవరూ అధైర్యపడకండి అని తాను కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం‘ అని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. గీత వృత్తిపై ఆధారపడి జీవించే కార్మికులకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుండి తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.




