10 March, 2026 | 7:25 PM

14, 15 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి

09-03-2026 12:36 AM

కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, మార్చి 8(విజయక్రాంతి): గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధం కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్.పి.వి వ్యాక్సిన్ ను 14-15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలికలు అందరికీ తప్పనిసరిగా ఇప్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం హెచ్.పి.వి వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి, లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హెచ్.పి.వి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైనదని, దీనిని తీసుకోవడం వల్ల 95 శాతం వరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను నిరోధించుకోవచ్చని అన్నారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఎవరు కూడా ఆందోళనకు గురి కాకుండా జిల్లాలో 14 - 15 వయస్సు కలిగిన 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్ లో హెచ్.పి.వి వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ సూచించారు.

ఇప్పటివరకు ఇది కేవలం ప్రైవేటు ఆసుపత్రులలోనే అందుబాటులో ఉండేదని, సర్వైకల్ క్యాన్సర్ ను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా ఈ వ్యాక్సిన్ ను అందిస్తోందని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సర్టిఫికెట్ తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తేనున్న హెల్త్ ప్రొఫైల్ కోసం ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని అన్నారు.

కాగా, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో శారీరక బలహీనత వల్ల కొంతమందికి అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చని, అంతమాత్రాన భయపడకుండా పారసీటమల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ సూచించారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలెక్టర్ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ  తదితరులు పాల్గొన్నారు.