మంథనిలో వైభవంగా గోదాదేవి కల్యాణం
శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఎక్కహం
మంథని, జనవరి14 (విజయ క్రాంతి): మంథని పట్టణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో బుధవారం ఏకాదశి శ్రీ గోదా మాత కళ్యాణం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ దుద్దిళ్ల మారుతి శర్మ గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో భగవంతుని సన్నిధిలో భజన కార్యక్రమం నిర్వహించడం ఎంతో శ్రేయస్కారం. అందులో భాగంగా స్థానిక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో నెల రోజుల పాటు భజన కార్యక్రమం నిర్వహించారు.
చివరి రోజున ఎక్కాహం ( స్థానిక అన్ని వాడలకు చెందిన భజనపరులు ) భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనాదిగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ నిర్వహన అచ్చలాపురం శ్రీనివాస్, తల్లం శ్రీనివాస్ శర్మ, నల్లగొండ శ్రీనివాస్, ఆలయ అర్చకులు వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా చివరి రోజైన రోజున గోదాదేవి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.




