01-11-2025 07:45:03 PM
తుర్కయంజాల్: మైనారిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 200మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూరులోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. త్వరలోనే మరింతమంది మైనారిటీలకు కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. మహిళలకు కుట్టుమిషన్లు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం పనికూడా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.