01-11-2025 07:48:21 PM
- రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
- హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు- ఎన్నికల అధికారులు, ఈ ఆర్ ఓ లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ, మొదట కేటగిరి A జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల ఓటర్లను నిర్ధారించడం జరిగిందని, మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
కేటగిరి C, కేటగిరి D లలోని ఓటర్లను కేటగిరి Aకు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, బి ఎల్ ఓ లు, బి ఎల్ ఓ సూపర్ వైజర్ల ద్వారా ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేష్ కుమార్, విజయ్ ప్రకాశ్ రావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.