16-05-2025 12:04:29 AM
ఉద్యోగులెమంటున్నారంటే.. ‘మా సమస్యలే ప్రభుత్వానికి ఆర్థిక భారంగా కనిపిస్తున్నాయా! మరి ప్రజా ప్రతినిధుల మాటేమిటి? ఏ రాష్ట్రంలో లేని జీతభత్యాలు ఎమ్మెల్యేలకు ఎందుకిస్తున్నారు? కేవలం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తే జీవితకాలం పెన్షన్ ఎందుకు? మంత్రులు జిల్లాల పర్యటనకు హెలికాప్టర్లను ఎందుకు వాడుతున్నారు? ప్రభుత్వ కార్యక్రమాలపై రూ.కోట్ల పత్రికా ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు? ఆ ప్రకటనలు సర్కార్కు ఆర్థిక భారం కాదా?’ అని ఉద్యో గ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఎవరికివారు ప్రకటనలిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి మాత్రం ‘ప్రభుత్వమంటే మే మొక్కరమే కాదు. మీరూ మేము. ఇద్దరం కలిస్తేనే ప్రభుత్వం. మనమందరం కలిసి ప్రజల కోసం పనిచేయాలి’ అని ఉద్యోగులను ఉద్దేశించి సభల్లో ప్రకటిస్తున్నారు.
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు చేయాల్సింది సమరం కాదు.. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి’ అని ఉద్బో ధిస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఇటు ఉద్యోగ సంఘాల నుంచి, అటు రాష్ర్టంలోని ప్రతిపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
‘రాష్ట్రం దివాళా తీసింది’ అని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడటం.. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉంది’ అని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ‘సీఎం స్థాయిలో ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరి వాదన తప్పు, ఎవరి వాదన సరైనది’ అనే చర్చ పక్కన పెడితే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఇప్పుడంతా చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం ప్రకటనలు..
దశాబ్దం నుంచి తెలంగాణ ఆదాయం పెరుగుతూ వస్తున్నది. 2014 --15లో రూ.5 లక్షల కోట్ల్లు కాగా, 2024- 25 నాటికి రూ.16 లక్షల కోట్లకు చేరింది. అలాగే రాష్ట్ర బడ్జెట్ 2014లో రూ.లక్ష కోట్ల నుంచి మొదలైంది. ఈ ఏడాది బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. అనేక సందర్భాల్లో రాష్ట్ర పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగానే ప్రకటించారు. దేశంలో ఢిల్లీ తర్వాత తెలంగాణనే దేశంలో రెండో సంపన్న రాష్ట్రంగా ప్రధానమంత్రి అడ్వుజరీ కౌన్సిల్ కూడా అభిప్రాయపడింది.
కానీ రాష్ర్ట ఆదాయానికి, ప్రభుత్వం చేస్తున్న వ్యయానికి పెద్ద ఎత్తున అంతరం ఉంది. గడిచిన పదేళ్లలో తెలంగాణ అప్పు రూ.72 వేల కోట్ల నుంచి రూ.7 లక్షల కోట్లకు పెరిగింది. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల జీతభత్యాలకు సర్కార్కు నెలకు రూ.22,500 కోట్లు అవసరమవుతాయని, కానీ.. రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లేనని ప్రకటించారు. కచ్చితంగా రాష్ట్ర అవసరాలు తీరాలంటే నెలకు మరో రూ.5 వేల నుంచి రూ.10 వేల కోట్లు అవసరమని చెప్పారు.
ప్రస్తుతం నెలనెలా వస్తున్న ఆదాయంలో రూ.6,500 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలు, మరో రూ.7,000 కోట్ల్లు అప్పు లు, వడ్డీలు చెల్లింపులకు వెళ్తాయని చెప్తున్నారు. ఇక మిగిలిన రూ.5000 కోట్లతోనే సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామంటున్నారు.
ఉద్యోగులకు సీఎం ప్రశ్నలు..
‘మీ డిమాండ్లను తీర్చడానికి ఏ సంక్షే మ పథకాన్ని ఆపమంటారు.. మీరే చెప్పం డి? వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? రై తు భరోసా ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? కల్యాణ లక్ష్మి పథకాన్ని ఆపమంటారా? మీరే చెప్పండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఓ సభలో ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నించారు.
‘అప్పు తీసుకువచ్చి అయినా సరే మీ డిమాండ్లను తీర్చుదామంటే, అప్పు కూడా పుట్టటం లేదు. అప్పు అడగటానికి మన అధికారులు ఢిల్లీ వెళ్లి బ్యాంక్ అధికారులను అపాయింట్మెంట్ అడిగితే, అపాయింట్మెంట్ ఇవ్వకపోగా చెప్పులెత్తుకుపోయే దొంగలను చూసినట్లు చూస్తున్నారు’ అని సీఎం మాట్లాడారు. ఉద్యోగులు ప్రకటించిన ఉద్యమ కార్యాచరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఖజానాపై తక్షణ భారం లేని 24 అంశాలను మొదట పరిష్కరించాలని, ఆర్థిక భారం పడే 14 అంశాలను దశలవారీగా పరిశీలించాలని ఉద్యోగ సంఘాలు ప్రభు త్వం ముందు ప్రతిపాదనలు పెట్టాయి. ఐదు డీఏ బకాయిలు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పెండింగ్ బిల్లులు కానీ, గత ప్రభుత్వం నుంచే ఉన్నాయి కాబట్టి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది.
ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం జూన్ 9న 50 వేల మందితో హైదరాబాద్లో సభ నిర్వహిస్తామని తీర్మానం చేస్తే, అందుకు ప్రతి గా సీఎం ‘మీరెందుకు సభ పెట్టడం. నేనే 10 లక్షల మందిని తీసుకువస్తాను. వారి సమక్షంలోనే చర్చిద్దాం రండి’ అని ఘాటు గా స్పందించారు. అలా రూ.9,000 కోట్ల పెండింగ్ బిల్లులు, ఐదు డీఏలు, ఓల్డ్ పెన్షన్ స్కీం పునర్ధరణను ఇప్పట్లో తేల్చలేమని సీఎం చెప్పకనే చెప్పారు.
సర్కార్ ఉద్యోగుల ప్రశ్నలు..
మరి ఉద్యోగులేమంటున్నారంటే.. ‘మా సమస్యలే ప్రభుత్వానికి ఆర్థిక భారంగా కనిపిస్తున్నాయా! మరి ప్రజా ప్రతినిధుల మాటేమిటి? ఏ రాష్ట్రంలో లేని జీతభత్యాలు ఎమ్మెల్యేలకు ఎందుకిస్తున్నారు? కేవలం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తే జీవితకాలం పెన్షన్ ఎందుకు? మంత్రులు జిల్లాల పర్యటనకు హెలికాప్టర్లను ఎందుకు వాడుతున్నారు? ప్రభుత్వ కార్యక్రమాలపై రూ.కోట్ల పత్రికా ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు? ఆ ప్రకటనలు సర్కార్కు ఆర్థిక భారం కాదా?’ అని ఉద్యో గ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల సమస్యకైనా పరిష్కారం లభించలేదని వాపోతున్నాయి. అందుకే పోరాటానికి పిలుపునిస్తున్నామంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు, డీఏ లు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఓల్డ్ పెన్షన్ స్కీం పునరుద్ధరణ, పెండింగ్ బిల్లులు, నగదు రహిత వైద్యం, 317 జీవో వంటి డిమాండ్లను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు పెట్టాయి.
ఆర్థిక సంక్షోభం దృ ష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేకపోతున్నామని, కానీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉన్నతాధికారుల త్రిసభ్య కమిటీని వేశామని ప్రభుత్వం చెప్తున్నది.
ఆదాయాన్ని పెంచే ప్రణాళికలే మేలు..
నెలనెలా వచ్చిన ఆదాయంలో సర్కార్ ఎక్కువ మొత్తాన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు వినియోగిస్తున్నది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పన్నేతర ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. గతంలో కంటే ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్య పన్నులశాఖలు అత్యంత సమర్థవంతంగా పనిచేయాలి.
మరోవైపు ప్రభుత్వం కూడా పొదుపు, వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజుల్లో తెలంగాణలో వృథా వ్యయాన్ని నియంత్రించాలని ఆర్థిక నిపుణుడు రఘురాంరాజన్, మంటెక్ సింగ్ అహ్లూవాలియా సూచించారు. సర్కార్ ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా ప్రణాళికలు రచించాలి.
తద్వారా ఎన్నికల ముందు ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మొత్తానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
డాక్టర్ తిరునహరి శేషు