16-05-2025 12:00:00 AM
నేడు మారోజు వీరన్న వర్ధంతి :
వర్తమానం ఎప్పుడూ గత చరిత్రను మరచిపోకూడదు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి లేదా గుణపాఠం నేర్చుకోవాలి. సూర్యుడిని మబ్బులు కమ్మేసినంత మాత్రాన వెలుగు లేనట్టు కాదు. వెలుగు అంతరించిపోయిందనుకోవడం ఎంత అవివేకమో, చరిత్రపై మట్టి కప్పి, ఇక సమాధి అయిందనుకోవడమూ అంతే అవివేకం. నేటి అస్తిత్వ పోరాటాలు ఒక్కసారిగా అగ్ని పర్వతం నుంచి పెళ్లుబికిన లావా లాంటివి కావు.
సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడి, తిరిగి నేలను తాకే కెరటాల్లాంటివి అంతకన్నా కావు. ప్రతి అస్తిత్వ ఉద్యమానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక గమ్యం ఉంటుంది. చివరకు ఆ ఉద్యమం ద్వారా సమాజానికి, అంతిమంగా దేశానికి మేలు కలుగుతుంది. అలాంటి ఉద్యమాలను ముందుండి నడిపే యోధులు ఎప్పుడు ఆదర్శమూర్తులుగానే నిలుస్తారు.
వారు గిట్టినా వేగుచుక్కలాగానే వెలుగుతారు. వారి సేవలను భవిష్యత్తు తరాలూ గుర్తుపెట్టుకుంటాయి. అలాంటి ఉద్యమకారుడే మారోజు వీరన్న. నిచ్చెన మెట్ల వ్యవస్థ వేళ్లూనుకున్న భారతదేశంలో వర్గ కుల పోరాటమే ప్రజలకు మేలు చేస్తుందని నమ్మిన ఉద్యమకారుడు ఆయన. ఆయన అమరుడై నేటికి 26 ఏళ్లు పూర్తయ్యాయి.
దళితుల ఊచకోతపై కన్నెర్ర..
ఒక పోరాటం, ఉద్యమం, విప్లవం.. పేర్లేవైనా కావచ్చు. అవి విజయవంతం కావడానికి ఒక సిద్ధాంతకర్త అవసరం. అలాంటి అవసరమే స్వతంత్ర పోరాటానికి భగత్సింగ్ను, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ను, పెట్టుబడిదారి వర్గం నుంచి విముక్తి కోసం కారల్ మార్క్స్ ను అందించింది. ఇది ఎవరు కాదన్నా చరిత్ర చెప్పే సత్యం. అలా వర్గ కుల పోరాట సిద్ధాంతాన్ని భుజానికెత్తుకున్నవాడు మారోజు వీరన్న.
నూనుగు మీసాల ప్రాయంలోనే ఆయన విప్లవోద్యమానికి ఆకర్షితుడయ్యాడు. కారంచేడు, చుండూరు, కంచికర్ల, పదిరికుప్పం, నీరుకొండ దమనకాండలకు వ్యతిరేకంగా గొంతెత్తిన ధీశాలి వీరన్న. దళితలపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా బహిరంగ సభలు నిర్వహించాడు. ‘భారతదేశంలో కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించాలి’ అనే సంకల్పంతో ఆయన పనిచేసేవాడు.
బీఆర్ అంబేద్కర్ రచనల్ని సమగ్రంగా చదివి ‘ఓ విప్లవ నేతలారా.. ఎర్రజెండాను భుజానికి ఎత్తుకున్న నాయకులారా ! భారత్లో కేవలం వర్గపోరాటం చేస్తే సరిపోదు. వర్గ- కుల ఉమ్మడి పోరాటాలు చేయాలి. అందుకు అంబేద్కరిజాన్ని దన్నుగా చేసుకుంటేనే భారతదేశంలో విప్లవం విజయవంతమవుతుంది’ అని మూడు దశాబ్దాల క్రితమే విప్లవ, వామపక్ష పార్టీల్లో చర్చలేవనెత్తిన నేత వీరన్న.
ఎన్నో పోరాటాలకు స్ఫూర్తి..
వీరన్న మూడు దశాబ్దాల క్రితమే దళితవాడల్లో సహపంక్తి భోజనాలు పెట్టించాడు. ఎన్నో జంటలకు కులాంతర వివాహాలు జరిపించాడు. తాను కూడా కులాంతర వివాహమే చేసుకున్నాడు. కులనిర్మూలన పోరాటానికి జనాన్ని కూడగట్టాడు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుల నిర్మూలన అంశంపై యువతకు శిక్షణ తరగతులు నిర్వహించాడు.
మాదిగలు ఆత్మగౌరవంతో ‘మేం మాదిగలం’ అని ‘గూటం’ అందుకొని మాది గ దండోరా వేసినా, ఎస్టీలు ‘మా తండాలో మా రాజ్యం’ అని నంగారా భేరీ వేసినా.. ఇలా ఒకటేమిటి.. చాకిరేవు దెబ్బ, మోకుదెబ్బ, గొల్లకుర్మ దెబ్బ, డోల్ దెబ్బ, ఎరుకలి కుర్రు, తంబూరా కిన్నెర మోత, తుడుం దెబ్బ ఇలా.. ఎన్నో ఆస్తిత్వ పోరాటాలకు స్ఫూర్తి ప్రదాత, కర్త, కర్మ, క్రియ.. అన్నీ వీరన్నే.
తన విద్యార్థి దశలోనే క్యాపిటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలన్నింటిని ఏకతాటి పైకి తెచ్చి, విద్యార్థుల కోసం హైకోర్టులో పిటిషన్ వేయించాడు వీరన్న. ఒకరకంగా నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయేలా చేసిన విద్యార్థి నేతగా వీరన్న గుర్తింపు పొందాడు.
ప్రజాయుద్ధ నౌక గద్దర్పై కాల్పులు జరిగినపుడు రాత్రికి రాత్రే ‘ప్రజాయుద్ధ నౌక గద్దర్ పై కాల్పులు’ అనే పేరుతో హైదరాబాద్లో వీరన్న పోస్టర్లు అంటించాడని ఎంతమందికి తెలుసు. అంబేద్కర్ కోరుకున్న చిన్న రాష్ట్రాల ఏర్పాటు నినాదంతో కేసీఆర్ కంటే ముందే, 1997లో సూర్యాపేటలో ప్రొఫెసర్ జయశంకర్ సార్తో కలిసి వీరన్న ప్రత్యేక తెలంగాణ కోసం ‘తెలంగాణ మహాసభ’ నిర్వహించాడు.
నాటి సభకు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్, పాత్రికేయుడు పాశం యాదగిరి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నలే సాక్ష్యం. అంబేద్కర్ భావజాలాన్ని వ్యాప్తిచేయడంలో వీరన్న చేసిన కృషి అంతా ఇంతా కాదు. వీరన్న ఉద్యమాలపై నాటి రాజ్యం సహజంగానే కక్ష పెంచుకున్నది. 1999 మే 16న వీరన్న బూటకపు ఎన్కౌంటర్లో కన్నుమూశాడు.
డాక్టర్ మెంతబోయిన సైదులు
9010910956