17-05-2025 12:09:04 AM
మానవ జీవితంలో నాల్గు ఆశ్రమాల లాగా పరిశోధకుని జీవితంలో నాల్గు అంశాలు ముఖ్యమైనవి. పరిశోధకుని అధ్యయన శీలం బ్రహ్మచర్యాశ్రమాన్ని తలపిస్తుంది. పరిశోధనాంశాన్ని ఎన్నుకొని ఆ అంశానికి సంబంధించిన అన్ని హంగులను సమకూర్చుకోవడం గృహస్థాశ్రమాన్ని సూచిస్తుంది.
ప్రకరణ విభజనలోని ఏకాగ్రత వానప్రస్థాశ్రమాన్ని గుర్తుచేస్తుంది. పరిశోధనను చిత్తశుద్ధితో పూర్తి చేసి సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించడం సంన్యాసాశ్రమ న్ని తెలియజేస్తుంది. సంన్యాసమంటే విడిచిపెట్టడమని సామాన్యార్థం. సమ్యక్న్యా సం బాగుగా లోకార్పడ చేయడమనేది విశేషార్థం.
అందుకే పరిశోధకుడు తన సిద్ధాం త గ్రంథం ద్వారా పరిశోధన ఫలాలను లోకానికందిస్తాడు. కనుక సంన్యాసమనే మాట వాడినాను. సల్ల విజయ్కుమార్ నా పర్యవేక్షణలో డాక్టరేట్ పొందిన 18వ విద్యార్థి. విజయ్కుమార్ కేవలం విద్యార్థిగా కాక, నా మనసు మెచ్చిన శిష్యునిగా మెలిగాడు. 2010లో పరిశోధన మొదలు పెట్టి ఐదేళ్లలో అకుంఠిత దీక్షతతో ‘ఆధునిక తెలంగాణ కవిత్వం- జనజీవన చిత్రణ’ అనే సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించాడు.
అనుమానాలు వచ్చినప్పుడు సందేహించకుండా నన్ను అడిగి తెలుసుకున్నాడు. ప్రమాణాలను మాత్రం ఎక్కడా ఉల్లఘించకుండా పరిశోధనలో కృతకృత్యుడయ్యా డు. ఇప్పటివరకు నా పర్యవేక్షణలో 24 మంది పీహెచ్డీ చేశారు. ఐతే నా వ్యక్తిత్వాన్ని, ఆదర్శంగా తీసుకొని అందరూ నడుచుకున్నారని చెప్పలేను. కానీ అట్లా నడుచుకున్న వారిలో మా విజయ్కుమార్ ఒకడని మాత్రం సగర్వంగా చెప్పకోగలను. మా ఉస్మానియా విద్యాలయం తెలుగు శాఖ ఎంతో గొప్పది. సమాజానికి ఎంతో మందిని గొప్పవాళ్ళను చేసి అందిచింది. అందుకే గొప్పదైంది. అలాంటి
విశ్వవిద్యాలయంలో పనిచేయడం మాకు గొప్పదే కదా! పట్టువీడని విక్రమార్కుని వలె..
విజయ్కుమార్ పరిశోధనతో ఎన్నో మెళకువలు నేర్చుకున్న విద్యార్థి. నేను ‘ప్రాచీన కావ్యాలు గ్రామీణ జీవన చిత్రణ’ అనే అంశాన్ని పీహెచ్డీ పరిశోధనాశంలా గ్రహిస్తే, దానికి కొనసాగింపుగా ‘ఆధునిక తెలంగాణ కవిత్వం జనజీవన చిత్రణ’ అనే అంశాన్ని విజయ్కుమార్ ఎన్నుకున్నాడు. ఈ విధంగా నా ఆలోచనలకు ఆధునిక రూపం ఇచ్చినవాడయ్యాడు.
పరిశోధనలో నాకు తగ్గవాడయ్యాడు. విజయ కుమార్లో ఒక సుగుణం ఉంది. అది నేర్చుకోవడం, ఆ నేర్చుకున్నదాన్ని పది మందికీ అందించడం. పరిశోధన కాలంలోనే అతడు గృహస్థ జీవనంలో అడుగుపె ట్టాడు. అయినా పట్టువీడని విక్రమార్కునివలె పరిశోధనను ఫలవంతంగా ముగించి, హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలలో స్నాతకోత్సవ తరగతులను బోధిస్తు న్నాడు.
నిన్న మొన్ననే పీజీటీగా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో అధ్యాపకుడిగా ఎంపికయ్యాడు. నా దగ్గర చుదు వుకుని విద్యార్థులు నాలాగే విధ్యుక్త ధర్మా న్ని నిర్వహించాలని అనుకుంటాను. అట్లా అనుకోవడం ప్రతి అధ్యాపకుని ధర్మం కూడా. శిష్యులతో విజయ్కుమర్ గణింపదగినవాడు. అతడు నాలాగా పద్యం నడి పించగలడు. పద్య పఠనం కొనసాగించగలడు.
అధునిక సాహిత్యంపై ఎంతసేపైనా మాట్లాడగలడు. రచనలు కూడా చేయగలడు. ఈ సందర్భంగా ఒక సంఘటనను వివరించక తప్పదు. నేను శాఖాధ్యక్షునిగా ఉన్న సమయంలో ఓయూలోని ‘అకాడమిక్ తరగతులు నిర్వహించాల్సి వచ్చింది. ఆ సందర్భంగా నేను ‘అధ్యాపకునికి మూర్తిమత్వం’ అనే అంశంపై మాట్లాడిన ప్రసంగాన్ని విజయ్కుమార్ విని నోట్ చేసుకొని తర్వాత శుద్ధప్రతి రూపంలో దాన్ని నాకు అందించాడు. ఆ కాపీ ఇప్పటికీ నాదగ్గర ఉంది. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే విద్యార్థికి.. మాట్లాడే శక్తి కంటే ముందు వినే శక్తి అవసరమని చెప్పడానికే.
గ్రామీణ జీవితం ప్రతిఫలించే పరిశోధన..
ఇక విజయ్కుమార్ పరిశోధన గురించి నాలుగు మాటలు చెప్పక తప్పదు. ఎక్కువమంది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇక్కడి సాహిత్య పరిశోధనాంశంగా స్వీకరించారు. విజయ్ కూడా తదనుగుణంగా ఆధునిక కవిత్వంలో తెలంగాణ జీవన స్థితిగతులను గుర్తించేందుకు సంకల్పించాడు. వందలాది పద్యగేయ వచన కవితా సంపుటాలను సేకరించాడు.
వాటిలో 200 వచన కవితలను అనుశీలించడం చెప్పుకోదగిన అంశం. ఆధునిక కవిత్వమంటే వచన కవిత్వమే అన్న అభిప్రాయం ఉంది. ప్రాచీన కవిత్వమంటే పద్యమని కూడా చెప్పడం కాకుండా, నేను ప్రాచీన పద్యంలో ప్రతిఫలించిన గ్రామ జీవనాన్ని చూపించాను. విజయ్కుమార్ తెలంగాణ జీవితాన్ని తెలియజేసే నలభైకి పైగా ఆధునిక పద్యకృతులను ఆమూలాగ్రం పరిశీ లించడం విశేషం.
గురువుల ఆశీర్వాదం కావాల్సిందే..
ఈ సందర్భంగా విజయ్కుమార్ జీవితంలో జరిగిన సంఘటనను, దాని పూర్వాపరాలను వివరించడం నా ధర్మం. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఎదిగిన పిల్లల పెళ్లిళ్లు చేయాలని అనుకుంటారు. అందులో తప్పు లేదు. ఇంట్లో విజయ్కుమార్ పెద్దవాడు కనుక పెళ్లిచేయాలనుకు న్నాడు అతని తండ్రి.
కానీ.. విజయ్కుమార్ మాత్రం తన చదువు పూర్తి కావా లని, తర్వాత ఉద్యోగం దొరకాలని, అప్పు డే పెళ్లి చేసుకుంటానని నిర్దద్వంగా తండ్రి కి చెప్పాడు. విజయ్కుమార్ ఏమనుకున్నాడో ఏమో తెలియదు గానీ నన్ను సంప్రదించాడు. అప్పుడు నేను ‘పెద్దవాని పెళ్లయితే గాని ఇంట్లో మిగతా వాళ్ల పెళ్లిళ్లు కావు. అందుకే తల్లిదండ్రులు తొందరపడతారు.
విద్య, ఉద్యోగం అందరి జీవితంలో సంపాదించుకుంటే వస్తాయి. కానీ.. మంచి సంబంధం ఎప్పుడుపడితే అప్పుడు రా దు. కాబట్టి నువ్వు ముందు పెళ్లి చేసుకో. నీకు అన్ని శుభాలు కలుగుతాయి’ అని ఆశీర్వదించాను. తల్లిదండ్రుల మాట గాని, గురువుల మాట గాని విన్నవాడెవ్వడూ చెడిపోడు. నా మాట విని విజయ్కుమార్ పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత అతడు పరిశోధన మాత్రం ఆపలేదు. భార్య కూడా అనుకూలవతి కనుక అతడు పీహెచ్డీ చేయడంలో ఎలాంటి ఇబ్బంది కలుగలే దు. విజయ్కుమార్ పీహెచ్డీ పూర్తి చేయగానే అతడికి ఓ గురుకుల విద్యాలయంలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడతనికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. తల్లిదండ్రులను కూడా బాగా చూసుకుంటున్నాడు.
ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనిపిస్తున్నది. మా గురువుల నుంచి నాకు ఎలాంటి ఆశీర్వాదం లభించిందో.. అలాంటి ఆశీర్వాదమే విజయ్ కుమార్కూ లభించింది. అందుకే ప్రతిఒక్కరూ పెద్దల మాటను ఆశీర్వాదంగా తీసుకోవాలని మనవి చేస్తున్నాను. అన్ని సమయాలు మనవి కాకపోవచ్చు.. కాని, కాలగమనంలో మనకు తప్పనిసరి కొన్ని సమయాలు అనుకూలిస్తాయి. ప్రతి వ్యక్తి జీవితంలో అదృష్టరేఖ ఒకటి ఉంటుంది. అది కలిసి వస్తుంది. ఆ కారణంగా ప్రతిఒక్కరూ నిర్భయంగా ముందుకు సాగిపోవా లనేది నా అభిప్రాయం.
వ్యాసకర్త సెల్: 98856 54381