calender_icon.png 28 June, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని వెనక్కి ఇప్పించు

27-06-2025 11:56:50 PM

మీ నిర్వాకం కారణంగా ప్రభుత్వాసుపత్రికి రోడ్డు లేకుండా పోయింది

మీరు స్వచ్ఛందంగా ఇవ్వకపోయినా కోర్టులో గెలుస్తా.. ఆస్పత్రికి రోడ్డు వేయిస్తా: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల: మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి జడ్చర్ల ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ప్రభుత్వాసుపత్రి ప్రధాన మార్గానికి అవరోధం కల్పిస్తూ ఆయన మేనల్లుడు కొనుగోలు చేసిన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని వెనక్కి ఇప్పించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. లక్ష్మారెడ్డి కుటుంబీకులు తాము అక్రమంగా కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిని స్వచ్ఛంధంగా వెనక్కి ఇవ్వకపోయినా కోర్టులో కేసు గెలిచి ఆ భూమిలో నుంచి ఆస్పత్రికి మెయిన్ రోడ్ నుంచి రహదారిని నిర్మించితీరుతామని ధీమా వ్యక్తం చేసారు. జడ్చర్ల కేంద్రంలో నిర్మించిన లయన్స్ సేవా కేంద్రం కొత్త భవన ప్రారంభోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మేనల్లుడు అక్రమంగా కొనుగోలు చేసిన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని వెనక్కి ఇస్తే మెయిన్ రోడ్ నుంచి ప్రభుత్వాసుపత్రికి నేరుగా రహదారి సౌకర్యం ఏర్పడుతుందని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ 2 ఎకరాల ప్రభుత్వ భూమి లక్ష్మారెడ్డి మేనల్లుడి చేతిలో ఉన్న కారణంగా ఆస్పత్రికి ఎమర్జెన్సీగా వచ్చే ఆంబులెన్స్ కూడా చుట్టూ తిరిగి గుంతలు నాలాల్లోంచి రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. లక్ష్మారెడ్డి మేనల్లుడు, ఆయన సొంత అక్క ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసారని దాన్ని వెనక్కి ఇప్పించాలని తాను కోర్టుకు పోతే లక్ష్మారెడ్డి మేనల్లుడు కోర్టుకు పోయి దానికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పిస్తానని చెప్పారని, అయితే ఇది జరిగి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ ఆ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించలేకపోయారని విమర్శించారు.

అసైన్ఢ్ భూమి కొనడం తప్పు అని, దీనిపై తాను నోటీసులు ఇస్తే కోర్టుకు పోయి ఆపడం ఇంకా తప్పు అని పేర్కొన్నారు. లక్ష్మారెడ్డి ప్రభుత్వాసుపత్రిని నాలాలో కట్టించి దానికి రోడ్డు లేకుండా తన మేనల్లుడితో అసైన్డ్ భూమిని కొనుగోలు చేయించారని ఆరోపించారు.  లక్ష్మారెడ్డికి నిజంగా జడ్చర్ల ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన పేరు చెప్పి ఆయన మేనల్లుడు అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం తప్పు అని చెప్పి ఆ భూములను వెనక్కి ఇప్పించాలని అనిరుధ్ రెడ్డి కోరారు. ఇది తాను తన గురించి అడగడం లేదని, కేవలం జడ్చర్ల ప్రజల మేలు గురించి తాను అడుగుతున్నానని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ 2 ఎకరాలను లక్ష్మారెడ్డి బంధువులు వెనక్కి ఇవ్వనప్పటికీ తాము ఈ విషయంగా కోర్టులో గెలుస్తామని, ఆ 2 ఎకరాలు వెనక్కి తీసుకొచ్చి మెయిన్ రోడ్ నుంచి ఆస్పత్రికి రోడ్ వేయించి తీరుతామని ధీమా వ్యక్తం చేసారు.

పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేసారో, తాను ఎమ్మెల్యే అయ్యాక జడ్చర్ల ఏం చేసానో అన్నది ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరినట్లు చెప్పారు. జిల్లాలో విద్యా అభివృద్ధి కోసం  ట్రిపుల్ ఐటీ కళాశాల, నవోదయ పాఠశాల శాంక్షన్ లో తన పాత్రను గుర్తు చేశారు.జడ్చర్ల పాత బస్టాండ్ మరమ్మత్తులు చేసి, తిరిగి ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదం వల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్క్యులర్ సౌకర్యం లేకపోవడం వల్ల బస్సులకు ఇబ్బందులు వస్తున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తానని పేర్కొన్నారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, అర్హులైన పేదలకే ఇండ్లు అందజేస్తామని స్పష్టం చేశారు.