18-07-2025 12:23:47 AM
ములుగు,జూలై17(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నదని,మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందడానికి ప్రతి మహిళను సంఘాలలో సభ్యులుగా చేర్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు,లోన్ భీమా,ప్రమాద చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇందిరమ్మ కళలను నెరవేర్చడానికి పలు పథకాలను అమలు చేయడం జరుగుతుందని,మహిళా జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబరాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు దాదాపు 26 వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశామని అన్నారు.రాష్ట్రంలోని మహిళా సంఘాలకు లక్షల కోట్లు కేటాయించడంతో పాటు వడ్డీ రుణమాఫీ చేసిన ఘనత తమ దేనని,మహిళలు అన్ని రంగాలలో రాణించడానికి పలు సంక్షేమ ఫలాలను అమలు చేయడంతో పాటు పలు రంగాలలో రాణించడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేట్ రంగంలో పలు వ్యాపారంలో మహిళలు రాణించడానికి అవకాశం ఉందని, ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ములుగు జియోజకవర్గంలో 9 మండల సమాఖ్యలు, 330 గ్రామ సమాఖ్యలు, 6 వేల 904 స్వయం సహాయక సంఘాలు, 69,736 స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొంటున్న.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కృషి చేయడానికి బ్యాంకు లింకేజీల ద్వారా 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 249.07 కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగిందని, 2025- 26 ఆర్థిక సంవత్సరానికి గాను 618 స్వయం సహాయక సంఘాలకు 54.79 కోట్ల రుణాలను అందించడం జరిగిందని వివరించారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన 5109 స్వయ సహాయక సంఘాలోని సభ్యులకు మహిళా 884.53 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించడం జరిగిందని,
5212స్వయం సహాయక సంఘాల లోని 52615 మంది సభ్యులకు 10 కోట్ల 74 లక్షల వడ్డీ లేని రుణాలను మహిళా శక్తి సంబరంలో అందించడం జరిగిందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వలంబం కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులను అందజేయడంతో పాటు లోన్ బీమా పథకం, ప్రమాద బీమా పథకం ఏర్పాట్లు, కొత్త సంఘాల ప్రారంభం, స్త్రీ నిధి రుణాలు అందజేయడం,
మైక్రో ఎంట్ర్పజెస్, పాడి గేదెల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, పౌల్ట్రీ మదర్ యూనిట్, సంచార చేపల విక్రయ కేంద్రం, వ్యవసాయ అనుబంధ జీవనోపాధి కల్పన కోసం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఏర్పాటు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు తదితర కార్యక్రమాలను మహిళా సంఘాల చే నిర్వహించడం జరుగుతుందని వివరించారు.