calender_icon.png 10 June, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలి

09-06-2025 11:12:53 PM

కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

కలెక్టర్ అభిలాష అభినవ్... 

నిర్మల్ (విజయక్రాంతి): మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతతో కూడుకున్న విషయమని, కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) తెలిపారు. సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క ప్రభుత్వ పథకాలపై మార్గదర్శకం చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు, ప్రభుత్వ పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలనీ, అక్టోబర్ 2 నాటికి ప్రారంభించేందుకు అవసరమైన స్థలాలను కలెక్టర్లు వెంటనే గుర్తించాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల పనులను నవంబర్ లోపు పూర్తిచేయాలని ఆమె సూచించారు. అలాగే, అంగన్వాడీలు జూన్ 11న పునఃప్రారంభం కావడంతో చిన్నారులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని, ’అమ్మమాట-అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని కోరారు. కొత్తగా అంగన్వాడీలు నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేయాలన్నారు. బడిబాట కార్యక్రమంపై మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. పాఠశాలల ప్రారంభ రోజునే యూనిఫాం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 90 శాతం యూనిఫాంల స్టిచింగ్ పూర్తయ్యిందని తెలిపారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ... బడిబాట కార్యక్రమం అమలుతో జిల్లాలో ఇప్పటివరకు 1,460 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని తెలిపారు.

పాఠశాలలు ప్రారంభమయ్యే రోజునే 48,874 మంది విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ చేయాలని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణానికి సంబంధించిన పనులు అనంతపేట సమీపంలో వేగంగా సాగుతున్నాయని, ఇటీవలే రాష్ట్ర మంత్రి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. అలాగే, జిల్లా పరిధిలో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేసేందుకు సంబంధిత కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలిపారు. ఎస్టీ మహిళలు, మారుమూల ప్రాంత మహిళలు స్వయం సహాయక బృందాల్లో తక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త సభ్యుల చేర్పు కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో సమీక్ష జరుపుతున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, డిఇఓ పి.రామారావు, డిఆర్డివో విజయలక్ష్మి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.