10-06-2025 12:00:00 AM
ఆదిలాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత నెలకొన్న క్రమంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులొచ్చా యి. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల ప్రారంభోత్సవం నిర్వహించగా, ఈ కార్యక్రమంపై ఈదురుగాలుల ప్రభావం పడింది.
వేగవంతమైన గాలులకు టెంట్లు కొట్టుకుపోయాయి. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్తో పాటు కార్యక్రమ నిర్వాహకులు, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డికి ప్రమాదం తప్పింది.
స్టేజి కింద కుర్చీ లో కూర్చొని ఉండగా ఒక్కసారిగా ఈదురుగాలులు బలంగా వీయడంతో పక్కనే ఉన్న విద్యుత్ లైట్ స్టాండ్ గాలికి పడిపోతుండగా భద్రతా సిబ్బంది ఎంపీపై పడకుండా పట్టుకున్నారు. సుమారు పది నిమిషాల పాటు స్టేడియంలోనే ఈదురుగాళ్ల మధ్య ఎంపీతోపాటు నిర్వాహకులు నిలిచుండిపోయారు.