01-06-2025 11:09:43 AM
ప్రభుత్వ బడి పరిరక్షణ కోసం యూటీఎఫ్ ప్రచార యాత్ర
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో(Government Schools) విద్యార్థుల నమోదు కొరకు పంతుళ్ళు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం(TS UTF Teachers Association) ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాను నిర్వహిస్తోంది. యుటిఎఫ్ ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తమ సంఘానికి చెందిన ఉపాధ్యాయులను జట్టుగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా జిల్లాకు ఒకటి చొప్పున వాహనాన్ని సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 26వ తేదీ నుంచి జూన్ 5 వరకు టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర శాఖ రాష్ట్రంలోని 33 జిల్లాలలో విద్యార్థుల నమోదు ప్రచార జాత నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు , ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఏకరూప దుస్తులు అందించబడుతున్నాయని, అలాగే నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని, విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని, అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశను ప్రైవేటు విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని, చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని, సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అని, మన ఊరు - మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌళిక వసతుల కల్పన మెరుగైందని ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో, నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందని, పిల్లల మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయని, మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలియజేస్తున్నారు. గుడి, మసీదు, చర్చి నిర్మాణాలకు ఐక్యంగా ఎలాగైతే కదులుతున్నారో, అదేవిధంగా ప్రజలంతా ‘మన ఊరి బడి పరిరక్షణ’ కోసం సంఘటితం కావాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.