01-06-2025 11:15:44 AM
నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం
కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. కోట శివకృష్ణ
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ(Professor Jayashankar Telangana Agricultural University), తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో పంటల సాగులో నాణ్యమైన విత్తనం పాత్రను గుర్తించి, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఈ సంవత్సరం 'నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం' అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని బెల్లంపల్లి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. కోట శివకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం చేశారు. గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమానికీ ఎంపిక చేసిన రైతులకు కొద్ధి మొత్తంలో పంపిణీ చేయబోతున్నామని ఆయన తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేయబడిన నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసిన ముగ్గురు నుండి ఐదుగురు అభ్యుదయ రైతులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు సూచన మేరకు జూన్ 2వ తేదీన ఈ వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబడుతుందని తెలిపారు. ఈ నాణ్యమైన విత్తనాన్ని రైతులు సాగు చేసి తదుపరి పంట ద్వారా ఉత్పత్తియైన విత్తనాన్ని తోటి రైతు సోదరులకి తక్కువ ధరకే అందజేయాలని, ఎంపిక చేయబడిన రైతులకు విత్తనోత్పత్తిపై ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుoదని తెలిపారు. తద్వారా రానున్న రెండు మూడు సంవత్సరాలలో ప్రతి గ్రామాన విత్తన స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం విత్తన భద్రతలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నదే ప్రధాన ఆశయమని తెలిపారు. రైతు సోదరులు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాన్ని గుర్తించి సహకరించాలని ఆయన కోరారు.