అర్ధరాత్రి వర్షం.. తడిసిన ధాన్యం.. రైతన్న ఆగమాగం
కొల్చారం,(విజయక్రాంతి): మంగళవారం అర్థరాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కొల్చారం మండలంలోని రంగంపేట, సంగాయిపేట, పైతర, తుక్కాపూర్ కోనాపూర్ వైమాందాపూర్ గ్రామాలలో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి రైతన్నలు ఆగమాగం అయ్యారు. ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం రాశులు, తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి.
ధాన్యం రాశుల కుప్పల చుట్టూ నీరు చేరింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానుల నిర్లక్ష్య మూలంగా 10 రోజుల క్రితం వేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాలనే ఉన్నాయని తూకం వేసిన 24 గంటల్లో ధాన్యం బస్తాలను మిల్లుకు తరలిస్తామన్న జిల్లా అధికారులు 10 రోజుల క్రితం తూకం వేశారు ధాన్యం తరలించడానికి లారీలు పంపాలని రైతులు మొరపెట్టుకున్నప్పటికీ స్పందించకపోవడం కారణంగానే తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం ఎలాంటి తరుగు లేకుండా మిల్లులకు పంపించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.






