05-06-2025 01:31:27 AM
మిల్లర్లకు 35లక్షల టన్నుల ధాన్యం అప్పగించిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): వేలంపాటలో ప్రభుత్వం విక్ర యించిన ధాన్యాన్ని బ్లాక్మార్కెట్లో అమ్ముకున్న రైస్ మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉంది. రైస్మిల్లర్ల నుంచి రావాల్సిన 23లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.7వేలకోట్ల బకాయిలు చెల్లించాలని, ప్రభుత్వం మిల్లర్లకు నోటీసులు జారీ చేసింది.
రైస్మిల్లర్ల నుంచి రావాల్సిన రూ.7వేలకోట్ల బకాయి లు సకాలంలో రాకపోవడంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా అదనంగా రూ.700కోట్ల వడ్డీభారం పడుతోంది. 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం 35లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ప్రతీ క్వింటాల్కు ధర రూ. 1,900చొప్పున వేలం వేసిన సివిల్ సప్ల య్ శాఖ టెండర్ దక్కించుకున్న ఏజెన్సీలకు అప్పగించింది. ఏజెన్సీ లు మిల్లర్ల నుంచి సుమారు 12లక్షల టన్ను ల వరి ధాన్యం సేకరించి ప్రతి క్వింటాల్కు రూ. 2,400చొప్పున చెల్లించారు.
ఇందులోనే రూ.500లాభం, బోనస్, అదనపు ఖర్చులు కూడా ఉన్నాయి. అదేసమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు రూ.1,900 కూడా మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించారు. కానీ, మిగిలిన 23 లక్షల టన్నులకు సంబంధించి సుమారు రూ.7వేల కోట్లు మాత్రం మిల్ల ర్లు ప్రభుత్వానికి ఇప్పటివరకు చెల్లించలేదు.
దీంతో ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ.700కోట్ల వరకు వడ్డీభారం పడుతోంది. అయితే మిల్లర్ల నుంచి మిగతా వరి ధాన్యాన్ని కొనుగో లు చేయలేకపోతున్నామని బిడ్డర్స్ చెబుతున్నారు. వాస్తవా నికి మిగిలిన 23లక్షల టన్నుల వరి ధాన్యం స్టాక్ మిల్లర్ల వద్ద లేదని, వారు అక్రమంగా బ్లాక్మార్కెట్లో విక్రయించి.. ఆ డబ్బును సొంతా నికి వాడుకు న్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలాఉండగా, టెండర్ నిబంధనల ప్రకారం బిడ్డర్లు బిడ్ వేయడానికి ముందు స్టాక్ను తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. పూర్తి సమాచారం సేకరిం చిన తర్వాతనే బిడ్డర్స్ టెండర్లు వేస్తారు. కాబట్టి ఇప్పుడు స్టాక్ లేదని చెప్పడానికి వీలుండదు. రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం బిడ్డర్లు 90రోజుల్లో రూ.7వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ముందుగా రూ.300కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ డబ్బును చెల్లించలేదు. ఇప్పటికే 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సంబంధించి బిడ్డర్లు మంచి లాభాలనే పొందారు. వేలంపాటలో ప్రభుత్వం విక్రయించిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు బ్లాక్మార్కెట్లో అమ్ముకోవడంతో ప్రభుత్వం ఇప్పుడు చిక్కుల్లో పడింది.
ప్రభుత్వానికి రావాల్సిన రూ.7వేలకోట్లు రాకపోవడంతో వడ్డీ నష్టాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని..అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులు జారీ చేస్తోంది. బిడ్డర్లు డిఫాల్ట్ అవుతుండటం, మిల్లర్ల వద్ద స్టాక్ లేకపోవడంతో క్రిమినల్ కేసులకు పాల్పడుతున్నారు. మిల్లర్లను బ్లాక్లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒకవేళ ప్రభుత్వానికి రావాల్సిన రూ.7వేలకోట్లు రైస్ మిల్లర్లు సకాలంలో చెల్లిస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, లేదంటే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే టెండర్ ధాన్యం లెక్కచూపని కొందరు అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు.