10-05-2025 01:37:34 AM
జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెల్లడి
యాదాద్రి భువనగిరి మే 9 (విజయక్రాంతి): ఈనెల 15వ తేదీ సాయంత్రం ప్రపంచ సుందరి మణులు పోచంపల్లి చేనేత వస్త్ర పరిశ్రమ మ్యూజియం ను తిలకించేందుకు పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర సంచాలకులు డాక్టర్ లక్ష్మి ఐఏఎస్ తో, డి.సి.పి.ఆకాంక్ష్ యాదవ్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వీరారెడ్డి లతో కలిసి కలెక్టర్ శుక్రవారం నా డుఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందినందున, సంస్కృతి సంప్రదాయాలతో మ్యూజియంను పచ్చదనంతో, పూలమొక్కలతో అందంగా తీర్చిదిద్దుతామన్నారు. మ్యూజియం లో చూపరులను ఆకర్షించేలా చేనేత వస్త్రాల అందమైన ఫోటోలు ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పుణికి పుచ్చుకున్న చేనేత వస్త్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చురగొంటున్న తరుణంలో భూదాన్ పోచంపల్లి చేనేత పరిశ్రమ ఇకపై మరింతగా విశ్వ వ్యాప్తం కానున్నదని, విశ్వసుందరి లను సాదరంగా ఆహ్వానించేందుకు అందుకు తగినట్లుగా మర్యాదగా హుందాగా ప్రవర్తించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా కోలాటంతో స్వాగతం పలుకుతామన్నారు.
అనంతరం వివిధ స్టాల్స్ తో ఇక్కత్ ప్రాముఖ్యతను వివరిస్తూ సింగిల్ ఇక్కత్, డబల్ ఇక్కత్ లను తెలియజేస్తామని వారు కూడా వీక్షించనున్నట్లు తెలిపారు. అంతకుముందు సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.విద్యుత్ శాఖ, ఫైర్ స్టేషన్, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యశాఖ అధికారులు అందుబాటులో ఉండాలని పోచంపల్లి లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి విస్తృత వైద్య సేవలందించాలన్నారు.
మున్సిపల్ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని తెలిపారు. పోలీస్ శాఖ అధికారులు భద్రత దృష్టిలో ఉంచుకొని బందోబస్తు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, టూరిజం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి, చౌటుప్పల ఆర్డీవో శేఖర్ రెడ్డి ఏసీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.