17-06-2025 12:00:00 AM
- మనుమరాలి పరిస్థితి విషమం
- కూతురు, అల్లుడికి తీవ్ర గాయాలు
- బీర్సాయిపేట గండి వద్ద చెట్టును ఢీకొన్న కారు
అదిలాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): కుటుంబ సభ్యులందరు కలిసి అప్పటి వర కు ఆనందంగా ఇంటికి వస్తున్న క్రమంలో అంతలోనే వారి ఆనందం విషాదంగా మారింది. ఉట్నూర్ మండలం బీర్సాయిపేట గండి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆదిలాబాద్ పట్టణం రిక్షా కాలనీకి చెందిన ఈర్ల రాజు కుటుంబ సభ్యులతో కలిసి బెల్లంపల్లి లోని తన బంధువు లను కలిసేందుకు కారులో వెళ్లారు. ఆదిలాబాద్కు తిరుగు ప్రయాణంలో ఉట్నూర్ మండలం బీర్సాయిపేట గండి సమీపంలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజు అత్తమ్మ విజయలక్ష్మి (55), రాజు కుమారుడు హరీష్ (16) అక్కడికక్కడే మృతి చెందగా, రాజుతో పాటు ఆయన భార్య సూచరిత, కూతురు ఆద్య (12) లకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడ్డవారిని ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఐతే ఆద్య (12) పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. మృతులతో పాటు గాయపడ్డ వారంతా ఒకే కుటుంబం వారు కావడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
ఎమ్మెల్యే పరామర్శ...
రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ రిమ్స్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాద విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని ఎమ్మెల్యే సూచించారు.