02-11-2025 12:24:22 AM
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోడిని వేలాడ దీసి ప్రజలకు పచ్చడి మెతుకులు పెడుతున్నారని.. తెలంగాణలో అహ నా పెళ్లంట సినిమాలోని ఓ సన్నివేశం తరహా పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు.. కానీ రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు శ్రీనివాస్నాయుడు తన అనుచరులతో కలిసి శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సంద ర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వారి మెడలోని పుస్తెల తాడు కూడా లాక్కుంటోందని సెటై ర్లు వేశారు. ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మీ, షాదీము బారక్, కేసీఆర్ కిట్ ఇచ్చారని చెప్పారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు అందించామని వెల్లడించారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ బంద్
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రంజాన్ తోఫా బంద్, బతుకమ్మ చీరలు బంద్, క్రిస్మస్ గిఫ్ట్.. ఇలా అన్నీ పథకాలను కాంగ్రెస్ ప్రభత్వం బంద్ చేసిందని మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోగా.. అన్ని బంద్ చేస్తామంటూ ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
రియల్ ఎస్టేట్ నాశనం చేశారని, ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కూలగొడుతున్నారని, హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఫైరయ్యారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా.. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ తోక కత్తిరించాలని పిలుపునిచ్చారు.
భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే.. దాన్ని కూడా డ్రామా అంటున్న కాంగ్రెస్కు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ను మళ్లీ తెచ్చుకోవాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని, ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.