మహబూబ్నగర్లో ‘హ్యాపీ సండే’
మహబూబ్ నగర్, మార్చి 8 (విజయక్రాంతి): చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు ‘హ్యాపీ సండే‘ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ స్టేడియం కమాన్ - కొత్త బస్టాండ్ ప్రధాన రోడ్డు కూడలి వద్ద మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీ, 10 లక్షల ఆరోగ్య బీమా, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఋణాలు ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో కళాకారులు ఆట పాటలతో ప్రదర్శించి అవగాహన కల్పించారు. చిన్నారుల చేత సాంస్కృతిక డాన్స్ కార్యక్రమాలు, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా ఇన్స్ట్రక్టర్ల చేత యోగాసనాల కార్యక్రమం నిర్వహించి యోగా చేయడం వల్ల వచ్చే ఆరోగ్య ఫలితాలను ప్రజలకు వివరించారు.
అలాగే లాఫింగ్ థెరపీ నిర్వహించి నవ్వడం వల్ల మనిషికి రోజువారి పని వత్తిడి నుండి మానసిక ఉల్లాసం కలిగి ఆరోగ్యంగా ఉంటారని నిర్వాహకులు వివరించారు. సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు కూడా ఉత్సాహంగా ఆటలు ఆడి పాటలు పాడి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సంఘాల సభ్యుల ద్వారా స్టాళ్లను ఏర్పాటు చేసి వారు తయారుచేసిన పౌష్టిక ఆహార పదార్ధాలను, ఇతర వస్తువులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్ జి. మమత, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమర్ కొత్వాల్, సీనియర్ సిటిజన్ ఫోరం సంఘం సభ్యులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




