కూలీల కడుపు కొట్టేందుకు చేతులు ఎలా వచ్చాయి?: హరీశ్ రావు
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంగా ప్రచారం చేసుకునే కాంగ్రెస్ రైతులను అడుగడుగునా దగా చేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్యెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో రూ.2,750 కోట్ల రుణమాఫీ చెక్కు ఇచ్చి రెండు నెలలవుతున్న ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడలేదు..? అని ప్రశ్నించారు. ఇచ్చిన చెక్కు డమ్మీనా..? లేదా చెక్కు బౌన్స్ అయిందా..? అని హరీశ్ రావు అడిగారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర రైతులకు ఇచ్చిన మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అక్కడ బీఆర్ఎస్ పై అన్ని అబద్దాలు చెప్పారని హరీశ్ రావు విమర్శించారు.
పదేళ్ల కేసీఆర్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని గోబెల్స్ ను మించిపోయి అబద్దాలు భట్టి విక్రమార్క చెప్తున్నారని ఆరోపించారు. అయితే బహిరంగ చర్చకు సిద్ధమా అని హరీశ్ రావు, భట్టికి సవాల్ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం(Indiramma Atmiya Bharosa Scheme)తో దళిత గిరిజన బీసీ రైతుల కడుపు కొట్టడమేన్నారు. కూలీల కడుపు కొట్టేందుకు మీకు చేతులు ఎలా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే పది లక్షల మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ 90 శాతం ఎగ్గొట్టి, రకరకాల కారణాలతో కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మట్టిపనికి వెళ్లే 90 లక్షల మంది రైతు కూలీలకు పథకం ఎగ్గొట్టడం దుర్మార్గమన్నారు. సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్ళిన వాళ్ళు రైతులతో చర్చలు జరిపి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాలను ప్రతి ఒక్కరికీ చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.






