calender_icon.png 11 November, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో చిన్నారులు బలవడం దురదృష్టకరం: హరీశ్ రావు

11-09-2024 05:04:31 PM

హైదరాబాద్, (విజయక్రాంతి): "పసికందును పీక్కుతున్న కుక్కలు.."  ఈ వార్త చూశాక నా మనసు కలచివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఇంత హృదయ విదారక విషాద ఘటనలు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గమన్నారు. కుక్కకాట్లకు రాష్ట్రంలో చిన్నారులు బలవడం దురదృష్టకరం అని హరీశ్ రావు తెలిపారు. కుక్కలు పీక్కు తినడం, కుక్కకాటుకు మరణాలు అనే వార్తలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయాయన్నారు. రాష్ట్రంలో కుక్కకాట్లు పెరిగిపోతున్నాయని ముందు నుంచి హెచ్చరించినప్పటికి ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఏడాది రాష్ట్రంలో 60 వేలకు పైగా కుక్క కాట్లు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండింది. 

నియంత్రణ పక్కన బెడితే, కనీసం యాంటీ రేబిస్ ఇంజక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని హరీశ్ రావు దుయ్యబట్టారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ పడకేసిందని, చెత్తాచెదారం పేరుకుపోయి వీధికుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందన్నారు. మున్సిపాలిటీలో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేక మనుషుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉంటే అందులో 10 లక్షలకు పైగా కుక్కలు జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయని,  వీధి కుక్కల నియంత్రణలలో ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని సిద్ధిపేట ఎమ్మెల్యే ఆగ్రహించారు. రాష్ట్రంలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయినా, వాటి సంతాన నియంత్రణ ఆపరేషన్లకు (స్టెరిలైజేషన్) ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. కుక్క కాటుకు ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి మందలించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని, కుక్కకాట్ల నివారణకు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని హైకోర్టు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యచరణ ప్రకటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

దేశంలో కుక్కకాటుల నివారణకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఒక కుక్క కాటు మరణం సంభవించని గోవా లాంటి రాష్ట్రాల నియంత్రణ పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. అదేవిధంగా గతంలో హర్యానా, పంజాబ్ హైకోర్టుల తీర్పును దృష్టిలో పెట్టుకొని కుక్కకాటుకు మరణించిన వారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేసియా, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్ గ్రేసియాను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్కకాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలని, యాంటీ రేబీస్ ఇంజక్షన్లు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలన్నారు. హైకోర్టు సూచన మేరకు రాష్ట్రంలో వీధి కుక్కల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేయాలి. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా గ్రామాల్లో, పట్టణాల్లో క్రమం తప్పకుండా స్టెరిలైజేషన్ చెయ్యాలి.