పోచారం గ్రామంలో గడ్డి వాముకు నిప్పంటించిన దుండగులు
- గడ్డి వాముకు సమీపంలో నివాస గృహాలు, వాహనాలు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది
- తృటిలో తప్పిన భారీ ప్రమాదం
బోధన్,(విజయ క్రాంతి): ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు గడ్డి వాముకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ సింగ్కు చెందిన గడ్డి వాము నిన్న అర్థరాత్రి అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
మంటలను గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి స్వయంగా అగ్నిని అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. గడ్డి వాముకు సమీపంలో నివాస గృహాలు, వాహనాలు ఉండటంతో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, స్థానికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.






