హెచ్సీఎ టీజీ20 లీగ్కు శ్రీకారం
- లోగో ఆవిష్కరించిన అంబటి రాయుడు, హీరో వెంకటేష్
- గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు గొప్ప ఛాన్స్
- అత్యుత్తమ ఆటగాళ్లు వెలుగులోకి వస్తారన్న రాయుడు
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు ఒక వేదిక ఉండాలన్న ఉద్ద్ధేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీజీ20 లీగ్ ప్రారంభించింది. ఈ లీగ్కు సంబంధించిన లోగోను అంబటి రాయుడు, హీరో వెంకటేష్ దగ్గుబాటి, మరియు సంగీత దర్శకుడు ఎస్.తమన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హెచ్సిఏ సింగిల్ మెంబర్ సూపర్వైజరీ కమిటీ చైర్మన్న్యాయమూర్తి పి. నవీన్ రావు, తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- క్రీడలు, యువజన, ఐటీఈ మరియు సీ జయేష్ రంజన్ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు వి. చాముండేశ్వర నాథ్, హెచ్సిఏ సభ్యులు, ఫ్రాంచైజీ యజమానులు మరియు ప్రముఖ కార్పొరేట్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ లీగ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 160 మంది ఆటగాళ్లతో కూడిన 8 ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటాయి. మొత్తం 20 రోజుల వ్యవధిలో 32 ఉత్కంఠభరితమైన మ్యాచ్లు నిర్వహించబడతాయి. అన్ని మ్యాచ్లు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్ జూన్/జూలై నెలల్లో జరగనుంది. ఈ లీగ్ గ్రామీణ స్థాయి క్రికెట్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఎలైట్ పోటీల మధ్య ఒక కీలక వంతెనగా రూపకల్పన చేశారు.
ఆటగాళ్లకు అధిక ఒత్తిడిలో మ్యాచ్ అనుభవం, ప్రొఫెషనల్ మౌలిక వసతులు మరియు అత్యున్నత స్థాయిలో రాణించడానికి అవసరమైన పోటీ వేదికను అందించడం దీని లక్ష్యం. ఈ లీగ్ ద్వారా తెలంగాణ నుంచి మరింతమంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి రావాలని, గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, హీరో వెంకటేష్ అభిప్రాయపడ్డారు.






