24-06-2025 01:56:42 AM
సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్, జూన్ 23: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో కొనసాగుతున్న విచారణ వాయిదా పడింది. ఈ భూములకు సంబంధించి దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై (పిల్) సోమవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి విచారణను వారాల పాటు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలిలోని వివాదాస్పద భూములను రాష్ట్రప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కి అప్పగించింది.
ఈ భూములను అభివృద్ధి చేసి, ఐటీ కంపెనీలకు కేటాయించేందుకు టీజీఐఐసీ ప్రణాళికలు సైతం రూపొందించింది. ఈ క్రమంలో, సదరు భూములను చదును చేసే ప్నులు ప్రారంభించడంతో, ఈ చర్యలను నిలిపేయాలని కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా నాలుగు పిల్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా, టీజీఐఐసీకి భూములు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.
కంచ భూముల కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో, ఇక్కడ విచారణ కొనసాగించడం సరికాదని భావించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.